ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. నిమ్మగడ్డకు కీలక సూచనలు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 17 July 2020 12:26 PM IST

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. నిమ్మగడ్డకు కీలక సూచనలు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వంపై న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తం చేసింది. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించాల్సిందిగా నిమ్మగడ్డను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరాల్సిందిగా సూచించింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ పై సుప్రీం కోర్టులో మూడు సార్లు విచారణ జరిగినా.. న్యాయస్థానం స్టే ఇవ్వలేదని రమేష్‌కుమార్‌ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. గవర్నర్‌ను కలిసి వినపతి పత్రం అందజేయాలని రమేష్‌కుమార్‌కు సూచించింది. గవర్నర్‌ను కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నామన్న నిమ్మగడ్డ లాయర్ కోర్టుకు తెలిపారు. వచ్చే శుక్రవారానికి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. ఈలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Next Story