షాకింగ్‌: మద్యం అమ్మకాలు జరపవద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

By సుభాష్  Published on  8 May 2020 3:53 PM GMT
షాకింగ్‌: మద్యం అమ్మకాలు జరపవద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కరోనా మహమ్మారి విజృంభనతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో అన్ని షాపులతో పాటు మద్యం షాపులు సైతం మూసివేయగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో రాష్ట్రాల్లో మద్యం షాపులు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో మద్యం ప్రియులకు ఊపిరి పోసినట్లయింది. కానీ మద్యం షాపులు తెరుచుకున్న ఆనందం కొన్ని రోజులు లేకుండా పోతోంది మద్యం ప్రియులకు.

తమిళనాడు రాష్ట్రంలో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా తమిళనాడులో మద్యం అమ్మకాలకు బ్రేక్‌ వేసింది మద్రాస్‌ హైకోర్టు. షాపుల నుంచే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా మద్యం అమ్మకాలు జరపవద్దని ఆదేశించింది. ఎక్కడా సామాజిక దూరం పాటించడం లేదని, అంతేకాదు మద్యం అనేది నిత్యావసర వస్తువు కాదని పేర్కొంటూ ప్రభుత్వానికి సూచించింది.

ఈనెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ముగిసే వరకూ మద్యం అమ్మకాలు జరపవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ దుకాణాలలో మద్యం అమ్మకాలకు సంబంధించి గడిచిన 48 గంటల వీడియోను పరిశీలించిన మద్రాస్‌ హైకోర్టు.. వెంటనే అమ్మకాలు జరపవద్దని స్పష్టం చేసింది. కాగా, హైకోర్టు ఆదేశాలతో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

Next Story