ఆమెకు భద్రత కల్పించండి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2020 1:03 PM GMT
ఆమెకు భద్రత కల్పించండి

టీమిండియా క్రికెట‌ర్‌‌ మహ్మద్‌ షమీ మాజీ భార్య‌ హసీన్‌ జహాన్.. ష‌మీ నుండి విడిపోయి కూతురుతో కలిసి వేరుగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా, హసీన్‌ జహాన్‌కు భద్రత కల్పించాలంటూ ప‌శ్చిమ‌బెంగాల్‌ హైకోర్టు.. కలకత్తా సిటీ పోలీసులను ఆదేశించింది.

వివ‌రాళ్లోకెళితే.. ఇటీవల అయోధ్యలో రామ‌ మందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో హిందువులకు శుభాకాంక్షలు తెలుపుతూ హసీన్‌ జహాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప‌ట్ల కొంద‌రు తనను వేధింపులకు గురిచేస్తున్నార‌ని.. తనకు, తన కూతురికి ప్రాణహాని ఉందని కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని.. భద్రత కల్పించాలంటూ ఈ సారీ కలకత్తా హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది.

దీంతో కలకత్తా హైకోర్టు మంగళవారం హసీన్ జహాన్‌ పిటీషన్‌పై వాద‌న‌లు విన్న‌ది. హసీన్‌ తరపు లాయర్‌ ఆమెకు సోషల్‌మీడియాలో వచ్చిన బెదిరింపులతో పాటు.. పోలీసులకు ఆమె చేసిన‌ ఫిర్యాదును రిపోర్టు రూపంలో కోర్టుకు సమర్పించారు. హసీన్‌ తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా.. పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కోర్టుకు తెలిపారు.

దీనికి సీనియర్‌ న్యాయవాది.. హసీన్‌ తరపు లాయర్‌ వాదనలను తోసిపుచ్చుతూ.. ఆమె‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని.. కేసు విచార‌ణ‌లో ఉందని తెలిపారు. వాదనలు విన్న జడ్జి.. హసీన్‌కు ఎటువంటి హాని జరగకుండా ర‌క్ష‌ణ క‌ల్సించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. అలాగే హసీన్‌ ఫిర్యాదుతో.. పోలీసులు తీసుకున్న చర్యలేంటో రిపోర్టు రూపంలో కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. అనంత‌రం కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు‌ పేర్కొన్నారు.

Next Story