Fact Check : ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న రైతులు భారత జాతీయ పతాకాన్ని తీసేశారా..?

Protesting farmers did not remove the Indian Flag at Red Fort.ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న రైతులు భారత జాతీయ పతాకాన్ని తీసేశారా

By Medi Samrat  Published on  27 Jan 2021 1:17 PM GMT
fact check news of Redfort

వేలాది మంది రైతులు ఈరోజు దేశ రాజధానిలో నిరసన ప్రదర్శనలను చేప్పట్టిన సంగతి తెలిసిందే. రైతుల కిసాన్‌ ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారింది. శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖాజీపూర్, తిక్రిత్, సింగ్ నంగ్లోయి తదితర ప్రాంతాలలో అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. రైతుల ర్యాలీలో ఢిల్లీ ఐటీఓ సమీపంలో ఒక నిరసనకారుడు మరణించినట్లు తెలుస్తోంది. నగరంలోకి చొచ్చుకొచ్చిన రైతులను నిలవరించేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

రైతు ఆందోళనకారులు కొంతమంది ఎర్రకోట వైపు దూసుకొచ్చి రైతు జెండాను ఎగరవేశారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత రెండు నెలలుగా రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు.

ఓ వైపు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండంటూ కోరుతున్నా కూడా ఆందోళనకారులు కనీసం పట్టించుకోలేదు. రైతులు ఎర్ర కోట వద్ద జెండాను ఎగురవేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే కొందరు సామాజిక మాధ్యమాల్లో రైతులు భారత జాతీయ పతాకాన్ని తీసివేసి.. రైతులు తీసుకొని వచ్చిన జెండాను ఎగురవేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. సిక్కులకు ఎంతో పవిత్రమైన జెండాను ఎగురవేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి.

https://twitter.com/APMLOfficial_/status/1354006480006098944

https://twitter.com/APMLOfficial_/status/1354035145335050240




నిజ నిర్ధారణ:

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ పోస్టులు 'ప్రజలను పక్కద్రోవ పట్టించే విధంగా ఉన్నాయి'.

నిరసనకారులు ఎర్ర కోట వద్దకు చేరుకున్న సంగతి నిజమే..! అయితే అక్కడ ఉన్న జాతీయ జెండాను నిరసనకారులు తీసివేయలేదు. న్యూస్ మీటర్ పలు మీడియాకు చెందిన వీడియో క్లిప్పింగ్ లను చూడగా.. త్రివర్ణ పతాకం ఎర్రకోట మీద ఎగురుతూనే ఉంది.


నిషాన్ షాహిబ్ కు చెందిన జెండాను ఆందోళనకారులు ఎర్ర కోట ముందు ఉన్న వేదికపై ఎగురవేశారు. వారు భారత జెండాను తీసి వేసి నిషాన్ షాహిబ్ జెండాను ఎగురవేయలేదు.

https://www.freepressjournal.in/india/farmers-protest-what-is-nishan-sahib-the-flag-hoisted-by-protesters-at-red-fort

నిషాన్ షాహిబ్ అన్నది త్రిభుజాకారంలో ఉన్న జెండా.. సిక్కులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. కాటన్, సిల్క్ తో ఈ జెండాను తయారు చేస్తారు. నిషాన్ అంటే గుర్తు, చిహ్నం అని అర్థం.. చాలా గురుద్వారాలలో ఈ జెండాను ఎగురవేస్తారు. అంతేకాకుండా ఈ గుర్తుకు ఖలిస్థాన్ మద్దతుదారులు ఉపయోగించే జెండాకు ఎటువంటి సంబంధం లేదు.

ఖలిస్థాన్ జెండాను ఎగురవేశారు అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో కూడా ఎటువంటి నిజం లేదు.

http://www.singhsabhaofmi.org/what-is-the-saffron-flag-nishan-sahib-on-the-gurdwara/

ఈరోజు ఆందోళన కారులు జెండా ఎగురవేసిన ప్రాంతం సాధారణంగా ఖాళీగానే ఉంటుంది. ఆ పోల్ మీదకు ఎక్కి ఆందోళనకారుడు జెండాను ఎగురవేయడాన్ని చూడొచ్చు.

https://www.timesnownews.com/india/article/delhi-protesting-farmers-enter-red-fort-unfurl-their-flags-watch/712105


ఆందోళన కారులు ఎర్రకోట దగ్గర భారత జాతీయ జెండాను తీసివేశారు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఖాళీగా ఉన్న పోల్ మీద ఆందోళనకారులు నిషాన్ షాహిబ్ జెండాను ఎగురవేశారు. వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నాయి.


Claim Review:ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న రైతులు భారత జాతీయ పతాకాన్ని తీసేశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story