భారత్‌ నిర్ణయం.. సాహసోపేతం: WHO

By అంజి  Published on  3 April 2020 6:02 AM GMT
భారత్‌ నిర్ణయం.. సాహసోపేతం: WHO

ముఖ్యాంశాలు

  • లాక్‌డౌన్‌ వల్ల రోజువారీ జీవితాలకు అంతరాయం: WHO
  • కరోనా కట్టడి కోసం వివిధ దేశాల చర్యలను పోల్చి చూడటం అవనసరం: WHO
  • భారత ప్రభుత్వ వ్యూహం పక్కాగా ఉంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక రాయబారి

హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ పూర్తిగా అంతరించిపోతుందని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌ఓ ప్రత్యేక రాయబారి డాక్టర్‌ డేవిడ్‌ నబారో అన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం.. ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేయాలని, ప్రజలు ఆ నిబంధనలు అనుసరించాలని ఆయన అన్నారు.

కరోనా వైరస్‌ విషయంలో భారత్‌ ముందే అప్రమత్తమైందని అన్నారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించి మహమ్మారి కరోనా వైరస్‌ కట్టడికి చాలా కృషి చేసిందని అన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక రాయబారి డాక్టర్‌ డేవిడ్‌ నబారో అన్నారు. ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన.. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

వైరస్‌ భారీగా విస్తరించిన తర్వాత దానిని అదుపు చేయడం కష్టమని అన్నారు. తక్కువ కేసులు నమోదైన దశలోనే ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం పోరాడితే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. ఒక క్రమ పద్దతిలో జరిగితేనే కరోనాను కట్టడి చేయగలమన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని గుర్తించడం, ఆ తర్వాత ఐసోలేషన్‌కు తరలించడం, అతని కాంటాక్ట్‌ కేసులను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందించడం ద్వారా కరోనా వ్యాప్తిని అదుపు చేయవచ్చారు. లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేయవచ్చని భారత్‌లో చూశానని డాక్టర్‌ డేవిడ్‌ నబారో పేర్కొన్నారు. భారత్‌ ఈ విషయంలో ముందు చూపుతో తీసుకున్న మంచి నిర్ణయం తీసుకుందంటూ డేవిడ్‌ కితాబిచ్చారు. క్షేత్ర స్థాయిలో మహమ్మారి కరోనాను కట్టడి చేసే సమయం దొరికిందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో ముందే మేల్కొందని అన్నారు.

Next Story