టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవి కుమార్ చౌదరి కన్నుమూశారు. నిన్న రాత్రి సమయంలో తన నివాసంలో గుండెపోటుతో రవి కుమారు తుదిశ్వాస విడిచారు. రవి కుమార్ హఠాన్మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటించిన 'యజ్ఞం' సినిమాతో రవి కుమార్ సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఆ తర్వాత బాలకృష్ణతో 'వీరభద్ర' సినిమా, సాయి ధరమ్ తేజ్తో 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమా తీసి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నితిన్తో `ఆటాడిస్తా` సినిమా చేశారు. రవి కుమార్ చివరిగా దర్శకత్వం వహించిన సినిమా 'తిరగబడరా సామి'. అప్పటి నుంచి రవి కుమార్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. గత కొంత కాలంగా ఫ్యామిలీ గొడవలతో ఒత్తిడిలో ఉన్నారని, కొంత మద్యానికి కూడా బానిసైనట్టు తెలుస్తోంది. రవి కుమార్ మృతికి తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రవి కుమార్ మృతి పట్ల తెలుగు దర్శకుల సంఘం సంతాపం ప్రకటించింది.