'మిథునం' కథా రచయిత కన్నుమూత
ప్రముఖ సినీ రచయిత, సీనియర్ పాత్రికేయులు శ్రీరమణ ఇక లేరు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రమణ.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
By అంజి
'మిథునం' కథా రచయిత కన్నుమూత
ప్రముఖ సినీ రచయిత, సీనియర్ పాత్రికేయులు శ్రీరమణ ఇక లేరు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రమణ.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దిగ్గజ దర్శకుడు బాపు, రమణతో కలిసి పని చేసిన అనుభవం రమణది. పేరడీ రచనలకు శ్రీరమణ ఎంతగానో ప్రసిద్ధి చెందారు. 'నవ్య' వార్తపత్రికకు ఎడిటర్గానూ ఆయన పని చేశారు. శ్రీరమణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన 'మిథునం' సినిమాకు కథ అందించింది శ్రీరమణే. 2012వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు సినిమా తీసిన నాటికే పాతిక సంవత్సరాల క్రితం ఆయన రచించిన 25 పేజీల మిథునం కథకు దర్శకుడు, నటుడు తనికెళ్ళ భరణి అద్భుతంగా చిత్రీకరించారు.
శ్రీరమణ "పత్రిక" అనే మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా ఉన్నారు. ఆయన హాస్యరచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు. శ్రీ రమణది గుంటూరు జిల్లా వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారం. 1952 సెప్టెంబరు 21న శ్రీరమణజన్మించారు. ఆయన అసలు పేరు కామరాజ రామారావు. ఆంధ్రజ్యోతి నవ్యతో పాటు సాక్షి దినపత్రికల్లో ఆయన పని చేశారు. వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగాలకు సేవలు అందించారు. అనేకమంది ప్రసిద్ధ రచయితల శైలిని అనుకరిస్తూ పేరడీలు రాసి స్వయంగా ఆయా రచయితల అభినందనలనూ పొందారు.