'నేను వోడ్కా తాగినా మైసమ్మకు మాత్రం విస్కీ తాగించా'

Ram Gopal Varma visits Maisamma temple in Warangal.నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Oct 2021 2:09 AM GMT
నేను వోడ్కా తాగినా మైసమ్మకు మాత్రం విస్కీ తాగించా

నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న ఏం చేసినా చేయ‌క‌పోయినా కాంట్ర‌వ‌ర్సీ అవుతుంది. తాజాగా ఈ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. మంగ‌ళ‌వారం కొండా మూవీ షూటింగ్ ప్రారంభిస్తున్న నేప‌థ్యంలో వ‌రంగ‌ల్‌కు వెళ్లాడు వ‌ర్మ‌. చిత్ర బృందంతో క‌లిసి స్థానిక గండి మెస‌మ్మ టెంపుల్‌ను ద‌ర్శించుకుని.. అమ్మ‌వారికి మందు తాగించారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌నే వెల్ల‌డించారు. 'నేను వోడ్కా తాగినా మైసమ్మకు మాత్రం విస్కీ తాగించా.. చీర్స్'' అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.

నిజానికి దేవుళ్లంటే వ‌ర్మ‌కు న‌మ్మ‌కం లేదు. కానీ సినిమా ఓపెనింగ్ రోజు నిర్మాత‌లు చేసే పూజ‌ల‌కు మాత్రం స‌హ‌క‌రిస్తున్నారు. త‌న కొత్త చిత్రం కొండా సినిమా షూటింగ్‌ను వ‌రంగ‌ల్ జిల్లా వంచ‌న‌గిరి గ్రామంలో నిన్న ప్రారంభించారు. షూటింగ్ ప్రారంభించ‌డానికి ముందు అక్క‌డ ఉన్న గండి మైస‌మ్మ అమ్మ‌వారి ఆశ్సీసుల‌ను చిత్ర‌బృందం తీసుకుంది. మనకు తెలిసి కూడా చాలా గ్రామాల్లో ఊరి దేవతలకి కల్లు ప్రసాదంగా పెడతారు. ఇక్కడ మందుని కూడా పెడతారంట. అందులో భాగంగానే ఆర్జీవీ అమ్మవారికి మందు తాగించారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దీనిపై నెటిజ‌న్లు కొంద‌రు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుళ్లపై నమ్మకం లేకపోతే వదిలేయండి కానీ కించపరచవద్దని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. నిజ జీవిత సంఘటనలు, బయోపిక్‌లను తెరకెక్కించడంలో వర్మ సాటి ఎవరు లేరు. కొండా చిత్రాన్ని తెలంగాణ రాజకీయ నేపథ్యంలో కొండా మురళి - సురేఖల జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కిస్తున్న వ‌ర్మ చెప్పాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఆర్జీవీ ఇప్పటికే విడుదల చేశారు. వరంగల్ లో 1980ల నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఈ చిత్రంలో వ‌ర్మ చూపించ‌బోతున్నాడు. కొండా మురళి పాత్రలో అరుణ్ అదిత్ కనిపించనున్నాడు. కొండా సురేఖ పాత్రలో 'భైరవగీత' ఫేమ్ ఇర్రా మోర్ నటించనుంది.

Next Story