మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవీ ఆరోగ్యంపై మంగళవారం ఉదయం నుంచి కొన్ని వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆమె అనారోగ్యానికి గురయ్యారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారని వార్తలు రావడంతో అభిమానులు, శ్రేయోభిలాషులలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు ఈ అంశంపై స్పందించారు. తన తల్లి అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
ఈ మేరకు నాగబాబు ఎక్స్లో ఇలా రాసుకొచ్చారు.. "మా అమ్మ అంజనాదేవి గారి ఆరోగ్యం చాలా బాగుంది. ఆమె అనారోగ్యంతో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వదంతులను నమ్మవద్దు" అని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్ధారించుకోకుండా వార్తలు ప్రచారం చేయవద్దని పలువురు నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.