ప్రముఖ నటి శారద అరుదైన గౌరవం అందుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన జీవితకాల సేవలకుగాను కేరళ ప్రభుత్వ అత్యున్నత సినీ పురస్కారమైన 'జేసీ డేనియల్ అవార్డు-2024'కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కింద రూ. 5 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేస్తారు. జనవరి 25న తిరువనంతపురంలో జరిగే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా శారద ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ కమిటీలో నటి ఊర్వశి, సినీ నిర్మాత బాలు కిరియత్ సభ్యులుగా, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ కార్యదర్శి సి. అజోయ్ కన్వీనర్గా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో 1945 జూన్ 25న వెంకటేశ్వరరావు, సత్యవాణి దేవి దంపతులకు శారద జన్మించారు. ఆమె అసలు పేరు సరస్వతీ దేవి. తెలుగులో 'ఇద్దరు మిత్రులు' చిత్రంతో నటిగా అడుగుపెట్టి, తన పేరును శారదగా మార్చుకున్నారు. 1965లో 'ఇణప్రావుకళ్' చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి ప్రవేశించారు. 'తులాభారం' (1968), అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన 'స్వయంవరం' (1972) చిత్రాలకుగాను జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకున్నారు. తెలుగు చిత్రం 'నిమజ్జనం' (1977)తో మూడోసారి జాతీయ ఉత్తమ నటిగా నిలిచి చరిత్ర సృష్టించారు.