రఘుపతి.. రాఘవ.. రాజారామ్‌లు క‌లిశారు.. 30ఏళ్ల త‌ర్వాత‌..!

Gang Leader Movie Brothers Meet In Hyderabad. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ సినిమా అన్నదమ్ములు ఇటీవల హైదరాబాద్ లో 30ఏళ్ల త‌ర్వాత కలిశారు.

By Medi Samrat
Published on : 25 Jan 2021 10:13 AM IST

Gang Leader Movie Brothers Meet In Hyderabad

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ ఎంత హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 1991లో విజయ బాపినీడు తెర‌కెక్కించిన ఈ చిత్రానికి బ‌ప్పిల‌హ‌రి సంగీతం అందించారు. ముగ్గురు అన్నదమ్ములు రఘుపతి, రాఘవ, రాజారామ్ క‌థ‌గా తెర‌కెక్క‌గా.. ఇందులో రఘుపతిగా మురళీమోహన్‌, రాఘవగా శరత్‌కుమార్‌, రాజారామ్‌గా మెగాస్టార్‌ చిరంజీవి నటించారు. వీరు ముగ్గురు అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు.

అయితే ఆ ముగ్గురు అన్న‌ద‌మ్ములు ఇటీవ‌ల‌ క‌లిశారు. దాదాపు 30 సంవ‌త్స‌రాల త‌ర్వాత క‌ల‌వ‌డ‌మే కాక గ్రూప్ ఫోటో దిగి ప్రేక్ష‌కుల‌కు ఆనందాన్ని అందించారు. రామోజీఫిలిం సిటీలో ఈ ముగ్గురు స్టార్స్ సినిమాల‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో అనుకోకుండా క‌లిసారు. ఫొటోల‌కు పోజిచ్చి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌ చేస్తుంది.

ఇదిలావుంటే.. చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఆచార్య సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండ‌గా, ముర‌ళీమోహ‌న్ ఆర్కే మీడియా వారి చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇక శ‌ర‌త్ కుమార్.. మ‌ణిరత్నం సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.




Next Story