హైదరాబాదులో జరిగిన 'గ్లోబ్ట్రాటర్' ఈవెంట్కు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో అభిమానులు ప్రవర్తించిన తీరుపై రాజమౌళి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. రాజమౌళి మహేశ్ బాబు అభిమానులపై ప్రశంసల వర్షం కురిపించారు.
"వారణాసి ఈవెంట్ కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించి వచ్చిన మహేశ్ అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 3 కిలోమీటర్లు చలిలో నడిచి వచ్చారు. మా వైపు నుంచి కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా, మీ సహనం ఎక్కడా తగ్గలేదు. ఒక్క విషయం చెప్పాలి... మీరు కూడా మీ అభిమాన హీరోలాగే ఎంతో క్రమశిక్షణతో ఉన్నారు. మద్దతుగా నిలిచిన ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడికి నా కృతజ్ఞతలు" అని రాజమౌళి తన పోస్టులో పేర్కొన్నారు.
మహేశ్ బాబు కూడా స్పందిస్తూ "మా 'వారణాసి' సినిమాను ప్రపంచానికి అందిస్తున్నాం. దూరం నుంచి వచ్చి మా బృందంపై ఇంత ఆప్యాయత చూపిన నా అభిమానులకు, మీడియాకు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే మళ్లీ మీ అందరినీ కలుస్తాను" అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.