పవన్కల్యాణ్, జూ.ఎన్టీఆర్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్ల పై విచారణ జరిగింది
By - Knakam Karthik |
పవన్కల్యాణ్, జూ.ఎన్టీఆర్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్ల పై విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ జరిపింది. సామాజిక మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ పిటిషన్ లో పేర్కొన్నారు.
కాగా పవన్ కళ్యాణ్,జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ ఫోటోలతో, అవమానకరంగా పోస్టులు ఉన్నాయని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఎక్స్, గూగుల్ను పవన్ కల్యాణ్,జూనియర్ ఎన్టీఆర్ ప్రతివాదులుగా చేర్చారు.
అయితే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించినట్లు న్యాయస్థానానికి ప్రతివాదులు తెలియజేశారు. తొలగించబడిన లింకులపై ఆదేశాలు జారీ చేసే ముందు లింక్ యొక్క వినియోగదారుడి వాదనలు వినాలని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాలో పోస్టులు అని ఇన్స్టాగ్రామ్ ప్రత్యేకంగా నిరాకరణను స్పష్టం చేయాలని కోర్టు సూచించింది. ఈ విషయాన్ని గూగుల్ తమ ఖాతాదారులకు తెలియజేయాలనీ లేదా ఖాతాను నిలిపివేయాలని సూచించింది. BSI , IP లాగిన్ వివరాలు 3 వారాలలో అందించాలన్న హైకోర్టు..తదుపరి విచారణ మే 12వ తేదీకి వాయిదా వేసింది.