బర్త్డే పార్టీలో గంజాయి, 9 మందికి పాజిటివ్..సింగర్ మంగ్లీపై కేసు నమోదు
ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik
బర్త్డే పార్టీలో గంజాయి, 9 మందికి పాజిటివ్..సింగర్ మంగ్లీపై కేసు నమోదు
ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ బర్త్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్కు 50 మంది హాజరు కాగా అందులో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు హాజరయ్యారు.
అయితే, ఆ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీ జరుగుతున్న త్రిపుర రిసార్ట్పై చేవెళ్ల పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ రెయిడ్లో భారీగా విదేశీ మద్యాన్ని వారు సీజ్ చేశారు. 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా.. అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో దామోదర్ అనే వ్యక్తి తో పాటు మరి కొందరు గంజాయి సేవించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పార్టీ నిర్వాహకులపై పోలీసులు NDPS యాక్ట్ కింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. మరో వైపు అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు త్రిపురా రిసార్ట్ జనరల్ మేనేజర్ శివరామకృష్ణపై కేసు నమోదు చేశారు.