ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు స్కూళ్లు బంద్‌

Uttar Pradesh schools shut till February 15.క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న పంజా విస‌ర‌డంతో ప‌లు రాష్ట్రాల్లో రోజువారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2022 5:29 AM GMT
ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు స్కూళ్లు బంద్‌

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న పంజా విస‌ర‌డంతో ప‌లు రాష్ట్రాల్లో రోజువారి కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో చాలా రాష్ట్రాల్లో క‌ఠిన ఆంక్ష‌లు విధించ‌డంతో పాటు రాత్రి క‌ర్ఫ్యూని అమ‌లు చేస్తున్నాయి. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా ఉద్దృతి నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌ను ఫిబ్ర‌వ‌రి 15 వ తేదీ వ‌ర‌కు మూసివేయాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం నిర్ణయించింది. ఈ మేర‌కు హోం అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ అవస్తీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆన్‌క్లాసులు మాత్రమే నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో ఇప్ప‌టికే పాఠ‌శాల‌ల‌ను మూసివేశారు. జ‌న‌వ‌రి 30 వ‌ర‌కు పాఠ‌శాల‌ల‌ను మూసివేయాల‌ని గ‌తంలో ప్ర‌భుత్వం ఆదేశాలు ఇవ్వ‌గా.. ఇంకా క‌రోనా ఉద్దృతి త‌గ్గ‌ని నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు సెల‌వుల‌ను పొడిగించారు. సెకండ్ బోర్డు ప‌రీక్ష‌ల‌ దృష్ట్యా ఆన్‌లైన్ క్లాసులు య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌ని హోం అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ అవస్తీ తెలిపారు.

ఇక ఉత్తరప్రదేశ్‌రాష్ట్రంలో బుధవారం 10,937 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో 80,342 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క లక్నోలో బుధవారం ఒక్కరోజే 2096 కొత్త కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక దేశ వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 14,62,261 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 2,86,384 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య4,03,71,500కి చేరింది. నిన్న 573 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 4,91,700కి చేరింది.

ఒక్క రోజులో 3,06,357మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 3,76,77,328కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 22,02,472యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 93.33శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 19.59శాతంగా న‌మోదు అయింది. నిన్న 26 ల‌క్ష‌ల మందికి టీకా అందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 163.84 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story