Telangana: జూన్‌ 12న పునఃప్రారంభానికి సిద్ధమైన పాఠశాలలు

పాఠశాలల పునఃప్రారంభానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం కావడంతో విద్యార్థులు వేసవి సెలవులను ఆస్వాదించేందుకు మరో రెండు వారాలు

By అంజి  Published on  26 May 2023 3:54 AM GMT
Schools, Telangana, Schools reopen

Telangana: జూన్‌ 12న పునఃప్రారంభానికి సిద్ధమైన పాఠశాలలు 

హైదరాబాద్‌: పాఠశాలల పునఃప్రారంభానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం కావడంతో విద్యార్థులు వేసవి సెలవులను ఆస్వాదించేందుకు మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూన్ 12న కొత్త విద్యా సంవత్సరానికి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)కి అనుబంధంగా ఉన్న పాఠశాలలు ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలల్లో 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించగా, రాష్ట్ర బోర్డుచే గుర్తింపు పొందిన పాఠశాలలు జూన్ 12 నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తాయి.

వేసవి సెలవులు ముగుస్తుండటంతో.. సొంత గ్రామాలకు వెళ్లిన అనేక కుటుంబాలు పట్టణాలకు చేరుకోవడం కోసం సర్దుకోవడం ప్రారంభించాయి. "8వ తరగతి వార్షిక పరీక్షల తర్వాత.. తొమ్మిదో తరగతి క్లాస్‌వర్క్ ఒక నెల పాటు నిర్వహించబడింది. తరువాత జూన్ 11 వరకు మాకు వేసవి విరామం ఇవ్వబడింది. ''ఉపాధ్యాయులు పెద్దగా హోంవర్క్ ఇవ్వనప్పటికీ, నా తల్లిదండ్రులు 9 తరగతిలోని అంశాలను అధ్యయనం చేయాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం, నేను నా స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నాను'' అని ప్రైవేట్ సీబీఎస్‌ఈ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని ఐరీన్ అన్నారు.

10,9, 8 తరగతుల విద్యార్థులు తమ పాఠశాల యాజమాన్యాలు నిర్వహించే ఆన్‌లైన్ తరగతులకు హాజరవడం లేదా వారి సెలవు సమయంలో IIT జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) లేదా నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కోసం సిద్ధమవుతున్నారు. "వేసవి సెలవులు అయినప్పటికీ, పాఠశాల యాజమాన్యం ప్రతిరోజూ ఉదయం ఒక గంట పాటు ఆన్‌లైన్ తరగతులు తీసుకుంటోంది" అని సీబీఎస్‌ఈ పాఠశాల విద్యార్థి ఒకరు చెప్పారు.

కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నందున, తల్లిదండ్రులు కూడా నోట్‌బుక్‌లు, స్టేషనరీ, పాఠ్యపుస్తకాల కోసం షాపింగ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చాయి. ఉపాధ్యాయులకు వేసవి సెలవులు ఇచ్చినప్పటికీ పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. “క్లాస్‌లో బోధించాల్సిన సబ్జెక్టుల వారీగా పాఠ్య ప్రణాళికలు, కంటెంట్‌ను సమర్పించమని మమ్మల్ని కోరారు. సెలవులకు ముందు పాఠశాల యాజమాన్యం కొత్త, వినూత్న బోధనా పద్ధతులపై శిక్షణా సమావేశాలను నిర్వహించింది. ఉపాధ్యాయులు జూన్ 2న పాఠశాలలో రిపోర్టు చేయవలసిందిగా కోరుతున్నారు” అని సీబీఎస్‌ఈ ఉపాధ్యాయులు తెలిపారు.

బడి బాట

కాగా, జూన్ 1 నుంచి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట (అడ్మిషన్ డ్రైవ్) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికి ప్రచారం నిర్వహించి పిల్లలను గుర్తించి పాఠశాలలో జాయిన్‌ చేయించాల్సి ఉంటుంది. బడి మానేసిన పిల్లలు లేదా చదువు మానేసిన విద్యార్థులను కూడా గుర్తించి వారి వయస్సు ప్రకారం తగిన తరగతిలో పాఠశాలల్లో చేర్పిస్తారు.

Next Story