తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే (జూన్ 21) ఆఖరు తేదీ. టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి. పదో తరగతిలో వచ్చి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటే.. మొదట గణితంలో, ఆ తర్వాత సైన్స్, ఇంగ్లిష్, సోషల్, ప్రథమ భాషలో మార్కులను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. మొత్తం 1680 సీట్లు కలవు. బాసర ఐఐఐటీలో 1500 సీట్లు, మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్లో 180 సీట్లు ఉన్నాయి. విద్యార్థుల వయసు 18 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మూడేళ్ల మినహాయింపు కలదు. పూర్తి వివరాలకు https://www.rgukt.ac.in/ ను విజిట్ చేయండి.