తొలివిడత జేఈఈ మెయిన్ పరీక్ష రేపటి నుండే.. ఈసారి ప్రాంతీయ బాషల్లో కూడా..
JEE Main 2021 February exams begin tomorrow. ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్-2021 తొలివిడత పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
By Medi Samrat Published on 22 Feb 2021 2:49 AM GMT
ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్-2021 తొలివిడత పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 23 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఆన్లైన్ ద్వారా ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఈ పరీక్షలు ఉంటాయి. తొలిసారిగా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్న నేఫథ్యంలో.. ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగు, మరో 11 ప్రాంతీయ బాషల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి.
పరీక్షల నిర్వహణకై రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాలలో కేంద్రాలను ఏర్పాటుచేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్టికెట్పై ముద్రించిన నిబంధనలను పూర్తిగాచదవాలని, వాటిని తప్పనిసరిగా పాటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు 21 లక్షల మంది ధరఖాస్తు చేసుకోగా.. రేపటి నుండి జరుగనున్న తొలివిడతలో 6.6 లక్షల మంది పరీక్షలు రాయనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ నుండి 73,782 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.