డాక్టర్ అనుమానస్పద మృతి
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 March 2020 10:38 AM GMTయువ డాక్టర్ అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన హైదరాబాద్లో జరిగింది. వివరాళ్లోకెళితే.. నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి హోం గాయత్రి నగర్ లో ఉండే సుభాష్(32) నిమ్స్ వైద్య కళాశాల నుండి గత సంవత్సరం కార్డియాలజీ విభాగంలో ఉత్తీర్ణుడై యశోద హాస్పిటల్లో డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సుభాష్ స్వస్థలం మంచిర్యాల జిల్లా టంగూర్ రామక్రిష్ణ పురం. తండ్రి ఆగయ్య.
ఇదిలావుంటే.. సుభాస్ 2017లో నేరేడ్మెట్కు చెందిన డాక్టర్ నిత్యను ప్రేమించి.. ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నాడు. అప్పటినుండి వారివురు స్థానికంగా గల పద్మావతి అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు. అయితే.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.
కాగా.. సుభాష్ నిన్న జ్వరంగా ఉందని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఇంట్లో మాత్రం అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.