అనుష్క ఆనందం పై జర్నలిస్ట్ కామెంట్.. దర్శకుడు మారుతి ఫైర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sep 2020 10:25 AM GMT
అనుష్క ఆనందం పై జర్నలిస్ట్ కామెంట్.. దర్శకుడు మారుతి ఫైర్

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ గర్భవతి అన్న విషయం తెలిసిందే. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అనుష్క తల్లికాబోతున్న ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. తన ఆనందాన్ని తెలియజేస్తూ.. సముద్రం ఒడ్డున నిలబడి ఉన్న ఫోటోను పోస్టు చేసింది అనుష్క. ఈ ఫోటోను చూసి అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే.. ఓ మహిళా జర్నలిస్ట్‌ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

" అనుష్కా.. ఆయన మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశారు.. ఇంగ్లాడ్‌కి మహారాణిని చేయలేదు కదా.. అంత ఆనందపడటం అవసరమా" అని కామెంట్ చేసింది. దీంతో నెటీజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. కాగా.. జర్నలిస్ట్‌ చేసిన కామెంట్ పై టాలీవుడ్‌ దర్శకుడు మారుతి ఫైర్‌ అయ్యారు. మీరు ఒక మహిళ అయి ఉండి ఇలా మాట్లాడడం భావ్యం కాదు.. ఓ మహిళ రాజ్యానికి రాణిగా ఉండడం కంటే ఓ బిడ్డకి తల్లిగా ఉండడంలోనే ఎక్కువ సంతోషపడుతుంది అని ఆయన అన్నారు. మాతృత్వపు మధురిమలను ఆస్వాదించడంతోనే ఓ మహిళ తన జీవితం పరిపూర్ణమైనదిగా భావిస్తుంది. నిజానికి ప్రతి మహిళా ఓ మహరాణినే.. సంతోషాలు నిండి ఉండే ప్రతి గృహం ఓ రాజ్యమే. ఆమె సెలబ్రిటీ కావడానికంటే ముందు ఓ సాధారణ స్త్రీ. తల్లి కాబోతున్న ఆ క్షణాలను ఆనందించే హక్కు ఆమెకు ఉంది అని మారుతి మండిపడ్డారు.

ఐపీఎల్‌లో పాల్గొనేందుకు విరాట్‌ కోహ్లీ యూఏఈకి వెళ్లిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో రాణించేందుకు విరాట్ కోహ్లీ తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టైటిల్‌ గెలవలేదు. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఆర్‌సీబీ అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story