ఈ నెల 16న ఉన్నావ్ తీర్పు..!
By జ్యోత్స్న Published on 11 Dec 2019 2:54 AM GMTదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు తీర్పును ఈ నెల 16న వెలువరించనుంది. ఈ కేసులో యూపీ కి చెందిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ సోమవారం దిల్లీ న్యాయస్థానంలో తమ వాదనలు ముగించింది. డిసెంబర్ 2న కెమెరా విచారణలో సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానానికి సమర్పించింది. దీంతో దిల్లీ న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. డిసెంబర్ 16న తీర్పును వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి ధర్మేష్ శర్మ వెల్లడించారు.
2017లో ఓ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్టు సెంగార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జూలైలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కుతో ఢీకొట్టిన కేసులో కూడా సెంగార్ నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడగా.. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న ఆమె ఇద్దరు మేనత్తలు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి బాధితురాలు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతోంది. అంతకు ముందు బాధితురాలి తండ్రి కూడా పోలీస్ కస్టడీలో అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.