అల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన ఢిల్లీ.. ఆర్సీబీ ఘోర పరాజయం
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Oct 2020 2:30 AM GMTఐపీఎల్-2020లో ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకెళుతోంది. అల్రౌండ్ ప్రదర్శనతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్లో, తర్వాత బౌలింగ్లో చెలరేరి 59 పరుగుల తేడాతో బెంగళూరును కంగుతినిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది.
ఆల్రౌండర్ స్టొయినిస్ (26 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించగా.. పృథ్వీషా (23 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్లు), రిషభ్ పంత్ (25 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన హైదరాబాద్ బౌలర్ సిరాజ్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసి ఓడింది.
కెప్టెన్ కోహ్లి (39 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్స్) తప్ప ఎవరూ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కగిసో రబడ (4/24) బెంగళూరు పతనాన్ని శాసించాడు. మరో పేసర్ నోర్జేకు రెండు వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇదిలావుంటే.. టి20 క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారతీయ క్రికెటర్గా, ఓవరాల్గా ఏడో క్రికెటర్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. తన 271వ టి20 మ్యాచ్లో కోహ్లి ఈ ఘనత సాధించాడు.
ఈ జాబితాలో క్రిస్ గేల్ (13,296 పరుగులు–396 మ్యాచ్లు), పొలార్డ్ (10,345–461 మ్యాచ్లు), షోయబ్ మాలిక్ (9,926–365 మ్యాచ్లు), బ్రెండన్ మెకల్లమ్ (9,922–364 మ్యాచ్లు), వార్నర్ (9,391–285 మ్యాచ్లు), ఫించ్ (9,140 పరుగులు–285 మ్యాచ్లు) వరుసగా తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు.