ముంచుకొస్తున్న క్యారా తుఫాను
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Oct 2019 6:41 AM GMTతూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి భారతదేశం దిశగా కదులుతోంది. దీంతో కర్ణాటక, మహారాష్ట్రలకు తుఫాను తాకే అవకాశం ఉంది. వన్ తీరంలో ఏర్పడిన ఈ తుఫానుకు క్యారా అని నామకరణం చేశారు. ఈ తుఫాను రత్నగిరికి పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో, ముంబైకు దక్షిణాన 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
దీంతో తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇది రత్నగిరి ప్రాంతం నుంచి రోమన్ తీరం వైపు కదులుతోంది. దీంతో వచ్చే ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రభావంతో కర్ణాటక గోవా తీరప్రాంతాలలో సాధారణ నుండి భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఉత్తర కొంకణి ప్రాంతంలో కూడా వర్షాలకు అవకాశం ఉంది. క్యార్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే కర్ణాటకలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. భారీ చెట్లు నేలకొరిగాయి. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.
అటు గోవాలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. సముద్రానికి, రోడ్లకి తేడా లేకుండా పోవడంతో స్థానికులు సైతం భయపడుతున్నారు. దీంతో పర్యాటకులు సైతం గోవాకి రావటానికి ఇది సరైన సమయం కాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.