ప్రాణం తీసిన అప్పు..రూ.8 లక్షలు తిరిగి ఇవ్వడంలేదని స్నేహితుడి హత్య

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది.

By Knakam Karthik
Published on : 30 May 2025 10:34 AM IST

Crime News, Hyderabad, Rajendranagar, Friends

ప్రాణం తీసిన అప్పు..రూ.8 లక్షలు తిరిగి ఇవ్వడంలేదని స్నేహితుడి హత్య

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలన్న విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌కు చెందిన సాయి కార్తీక్, పులివెందులకు చెందిన సిద్ధార్థరెడ్డి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. సాయి కార్తీక్ రాజేంద్ర నగర్ పరిధిలోని బుద్వేల్‌లో నివాసం ఉంటున్నాడు. మరో యువకుడు సిద్ధార్థరెడ్డితో సాయి కార్తీక్‌కు స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే సాయి కార్తీక్ తన ఆర్థిక అవసరాల కోసం సిద్ధార్థ రెడ్డి దగ్గర రూ.8 లక్షల అప్పు తీసుకున్నాడు. అయితే అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని సిద్ధార్థరెడ్డి సాయి కార్తీక్‌ను కోరాడు. ఈ విషయంపై సాయి కార్తీక్ కాలయాపన చేశాడు. డబ్బులు అడిగితే సిద్ధార్థరెడ్డిని చంపుతానని బెదిరింపులకు గురి చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటూ ఉండేది. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి కూడా సిద్ధార్థరెడ్డి, సాయి కార్తీక్ కలిసి తాము ఉంటున్న అద్దె గదిలో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య డబ్బు విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సిద్ధార్థరెడ్డి అకస్మాత్తుగా సాయి కార్తీక్‌పై దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో సాయి కార్తీక్ మృతి చెందాడు. అనంతరం సిద్ధార్థ రెడ్డి అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story