విషాదం..దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకి సాఫ్ట్వేర్ సూసైడ్
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది
By Knakam Karthik
విషాదం..దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకి సాఫ్ట్వేర్ సూసైడ్
హైదరాబాద్ మాదాపూర్లో విషాదం చోటు చేసుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. కాగా మృతురాలిని సుష్మ(27)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సికింద్రాబాద్ అడ్డగుట్టలో నివాసముంటున్న సుష్మ అనే యువతి ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. బుధవారం రోజున హైటెక్ సిటీలోని తన కార్యాలయానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, సాయంత్రం అయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.
దీంతో తండ్రి జంగయ్య తన కూతురు కనిపించడంలేదంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుష్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే దుర్గం చెరువులో ఓ యువతి మృతదేహం ఉన్నట్లు వారికి సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా..ఆ మృతదేహం సుష్మదిగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో సుష్మ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.