రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాలో భార్య, ఆమె 16 ఏళ్ల కొడుకుతో కలిసి భర్తను గొంతు నులిమి చంపిన సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. హత్య తర్వాత మృతదేహాన్ని కాలువలో పడవేసి.. ఎనిమిది రోజులుగా కనిపించకుండా పోయినట్లు నటించడం ద్వారా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి కుట్ర పన్నారు. ఈ కేసులో భార్యతో సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.
బన్స్వారా పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ జోషి ఈ సంఘటన గురించి వివరాలు వెల్లడించారు. ఆ మహిళ ఫిబ్రవరి 26న తన భర్త తప్పిపోయినట్లు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. అదే రోజు ఆ వ్యక్తి మృతదేహం కాలువలో కనుగొనబడింది. ఇది మొదట ఆత్మహత్యగా భావించాము. దీంతో కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది.
తరువాత, మృతుడి సోదరులు భార్యపై హత్యాయత్నం చేసినట్లు అనుమానిస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. పోలీసుల కఠినమైన విచారణలో, భార్య నేరం అంగీకరించింది. దర్యాప్తులో మృతుడు మద్యం సేవించేవాడని, ఇంట్లో తరచూ గొడవ పడేవాడని తేలింది. ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి తాగిన మత్తులో జరిగిన గొడవ తర్వాత, అతని భార్య, కొడుకు రుమాలుతో గొంతు నులిమి చంపారు. హత్య తర్వాత, ఆ మహిళ తన బంధువు, స్నేహితురాలు, ఆమె అత్తకి ఫోన్ చేసింది. ఐదుగురు కలిసి మృతదేహాన్ని చెక్క నిచ్చెనకు కట్టి గ్రామ సమీపంలోని కాలువలో పడేశారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.