ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో ఆస్తి తగాదా పెను విషాదానికి దారితీసింది. రాంనగర్ గ్రామానికి చెందిన నిరంకర్ అనే యువకుడు ఆదివారం రాత్రి తన కుటుంబ సభ్యులపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో నిరంకర్ తండ్రి, తల్లి, నానమ్మ మరియు సోదరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అడ్డువచ్చిన పెద్దన్నయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవలే నిరంకర్ తండ్రి ఒక భూమిని విక్రయించగా, ఆ డబ్బులో వాటా కావాలని నిరంకర్ గొడవ పడటమే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు తెలిపారు.
కుటుంబ సభ్యులను హతమార్చిన అనంతరం, నిరంకర్ ఇటుకతో తలపై కొట్టుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం లక్నో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో రక్తంతో తడిసిన గొడ్డలి, ఇటుకను స్వాధీనం చేసుకున్న ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. గ్రామంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దారుణం వెనుక ఉన్న పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.