ప్రాణం తీసిన ఈత..అల్లూరు జిల్లాలో ముగ్గురు చిన్నారులు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం జరిగింది.
By Knakam Karthik
ప్రాణం తీసిన ఈత..అల్లూరు జిల్లాలో ముగ్గురు చిన్నారులు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం జరిగింది. సరదాగా చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. డుంబ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ కేంద్రంలోని జంగమయ్య ఆలయానికి ఎదురుగా ఉన్న ముగ్గురు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో అందులో గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు గుంటసీమ పంచాయతీ గంగవలస గ్రామానికి చెందిన కొర్ర సుశాంత్, కోతంగి పంచాయతీ బిల్లాపుట్ గ్రామానికి చెందిన గుంట భానుతేజ, సాయికిరణ్గా గుర్తించారు. భానుతేజ, సాయికిరణ్ వారం క్రితమే మేనమామ ఇంటికి వచ్చారని పేర్కొన్నారు. ఈలోపు స్నేహితుడితో కలిసి సరదాగా చెరువులో ఈతకు దిగి మృతి చెందారని తెలిపారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు తమ పిల్లలు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. ఇది చూసి అక్కడివారు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.