విషాదం.. నీట్కు సిద్ధమవుతున్న విద్యార్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో నీట్కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 25 Jan 2024 11:17 AM IST
విషాదం.. నీట్కు సిద్ధమవుతున్న విద్యార్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో నీట్కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి పోలీసులు గదిలోకి ప్రవేశించగా విద్యార్థి మృతదేహం ఉరివేసుకుని కనిపించింది. ఈ ఏడాది కోటాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని ఎంబీఎస్ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. విద్యార్థి మృతిపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
మృతుడు మహ్మద్ జైద్ (19) ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నివాసి అని డీఎస్పీ భవానీ సింగ్ తెలిపారు. కోటలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో నివాసం ఉండేవాడు. జైద్ నీట్ కోసం రెండవ ప్రయత్నం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు గది నుంచి బయటకు రాకపోవడంతో మరో విద్యార్థి తలుపు తట్టాడు.
అతని హాస్టల్ నిర్వాహకుడికి సమాచారం అందించారు. రాత్రి 10 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గది డోర్ను పగలగొట్టగా, జైద్ ఉరి వేసుకుని కనిపించాడు. ఫ్యాన్కు తాడుతో ఉరివేసుకున్నాడు. మహ్మద్ జైద్ రాత్రి చదువుకునేవాడని, పగలు నిద్రించేవాడని హాస్టల్లో ఉంటున్న ఇతర విద్యార్థులు తెలిపారు.
మంగళవారం సాయంత్రం వరకు గది నుంచి బయటకు రాలేదని విద్యార్థి స్నేహితుడు అనుప్ చౌరాసియా తెలిపారు. “డోర్ కొట్టినా తలుపు తీయలేదు. డెంగ్యూతో బాధపడుతూ వెనుకబడ్డాడు. ఎక్కువగా ఆన్లైన్ తరగతులు మాత్రమే తీసుకుని రాత్రిపూట చదువుకునేవాడు. అతను బాగా స్కోర్ చేయలేకపోయాడు, కానీ అలాంటి టెన్షన్ అతనిలో లేదు” అని అన్నారు.