మొదట అలసిపోయినట్లు నటించింది.. ఆ తర్వాత "అతన్ని చంపండి" అంటూ..
రాజా రఘువంశీని చంపడానికి పథకం అతని భార్య సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా రూపొందించారని పోలీసులు చెబుతున్నారు.
By Medi Samrat
రాజా రఘువంశీని చంపడానికి పథకం అతని భార్య సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా రూపొందించారని పోలీసులు చెబుతున్నారు. రాజా రఘువంశీ, సోనమ్ వివాహం చేసుకున్న ఐదు రోజుల తర్వాత, రాజ్ తన చిన్ననాటి స్నేహితులైన ఆనంద్ కుమ్రీ (23), ఆకాష్ రాజ్పుత్ (19), విశాల్ సింగ్ చౌహాన్ (22) లను మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఒక కేఫ్కు పిలిచి రాజా హత్యకు ప్లాన్ చేశాడు. బాగా డబ్బు ఇస్తానని చెప్పినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.
మే 20న, రాజా, సోనమ్ మేఘాలయలో తమ హనీమూన్కు బయలుదేరారు. ముగ్గురు హంతకులు ఈశాన్య ప్రాంతాలకు వారిని వెంబడించారు. మే 20న రాజ్ తన స్నేహితులను మొదట గౌహతికి పంపారు, అక్కడ వారు ఆన్లైన్లో గొడ్డలిని ఆర్డర్ చేశారు. అక్కడి నుండి షిల్లాంగ్కు వెళ్లి సోనమ్, రాజా హోమ్స్టే సమీపంలోని ఒక హోటల్లో బస చేశారు.
ఈలోగా నూతన దంపతులు మూడు రోజుల పాటు కొండల్లో తిరిగారు. కానీ మే 23న, ఫోటోషూట్ నెపంతో సోనమ్ రాజాను కొండ ప్రాంతానికి తీసుకెళ్లింది. ముగ్గురు నిందితులు కూడా వారిని అనుసరించి మొదట రాజాతో హిందీలో మాట్లాడారు. చివరికి, సోనమ్ తాను అలసిపోయినట్లు నటించింది. తన భర్త ముందు నడుస్తూ ఉండగా హంతకుల వెనుక సోనమ్ నడవడం ప్రారంభించింది. ఐదుగురు వ్యక్తులు నిర్జన ప్రదేశానికి చేరుకోగానే, సోనమ్ "అతన్ని చంపండి" అని గట్టిగా అరిచేసింది.
ఈ సమయంలో, సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా సంఘటన స్థలంలో లేడు. అతను మేఘాలయకు ప్రయాణించలేదు, కానీ షిల్లాంగ్ పోలీసు వర్గాలు అతను తెరవెనుక ఈ హత్యకు ప్లాన్ చేసాడని, సోనమ్తో సంప్రదింపులు జరిపాడని పోలీసులు అనుమానిస్తున్నారు.