Telangana: లింగమార్పిడి చేయించుకుని రోజాగా మారిన భర్త.. హత్య చేసిన భార్య

లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని వేధిస్తున్న భర్తను చంపేందుకు సిద్ధిపేట జిల్లాలో ఓ మహిళ రూ.18 లక్షలకు కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చింది.

By అంజి  Published on  8 Jan 2024 1:04 AM GMT
Siddipet, Telangana, Crime news, sex change

Telangana: లింగమార్పిడి చేయించుకుని రోజాగా మారిన భర్త.. హత్య చేసిన భార్య 

లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని వేధిస్తున్న భర్తను చంపేందుకు సిద్ధిపేట జిల్లాలో ఓ మహిళ రూ.18 లక్షలకు కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చింది. మహిళతో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దరిపల్లి వెంకటేష్ లింగమార్పిడి చేయించుకుని రోజాగా పేరు మార్చుకున్నాడు. రోజాను హత్య చేసిన మూడు వారాల తర్వాత వేదశ్రీ, ఇతర నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 11న రోజాతో కలిసి మద్యం పార్టీ చేసుకున్న తర్వాత హంతకులు రోజాను పొట్టన పెట్టుకున్నారు.

రోజాను హత్య చేసేందుకు వేదశ్రీ రూ.18 లక్షల సుపారీ ఇచ్చింది. రూ.4.60 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లిస్తానని హామీ ఇచ్చింది. సిద్దిపేట పట్టణానికి చెందిన వెంకటేష్‌తో వేదశ్రీకి 2014లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. వెంకటేష్ మొదట్లో అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. తరువాత, అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతను లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తన పేరును రోజాగా మార్చుకుని సిద్దిపేట పట్టణంలో రోడ్లపై భిక్షాటన చేయడం ప్రారంభించాడు. తమ కుమార్తెను భిక్షాటన కోసం తనతో పంపాలని వేదశ్రీని రోజా వేధించేది. వేదశ్రీ టీచర్‌గా పనిచేస్తున్న ప్రైవేట్ స్కూల్‌లోకి వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. పాఠశాలలో రోజా సమస్యలు సృష్టించడంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది.

అదే పట్టణానికి చెందిన బోయిని రమేష్ (32)తో స్నేహంగా మెలిగిన వేదశ్రీ.. రోజాను అంతమొందించేందుకు అతడితో కలిసి పథకం వేసి హంతకులను నియమించుకుంది. పథకం ప్రకారం ఇప్ప శేఖర్ (24) ఒంటరిగా ఉంటున్న రోజా ఇంటికి వెళ్లి మద్యం తాగించాడు. నిందితులు మరో ఇద్దరితో కలిసి దిండుతో కొట్టి చంపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. శవపరీక్ష నివేదికలో రోజాది హత్యేనని తేలడంతో పోలీసులు విచారణ ప్రారంభించి శాస్త్రీయ ఆధారాలు సేకరించారు. వేదశ్రీని విచారించగా నేరం ఒప్పుకుంది. మొత్తం ఐదుగురు నిందితులు రోజా హత్యకు సహకరించారని పోలీసులు తెలిపారు. వేదశ్రీతో పాటు రమేష్‌, శేఖర్‌లను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story