Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. విమాన పైలట్ మృతి
మేడ్చల్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 8 July 2024 3:45 PM IST
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. విమాన పైలట్ మృతి
మేడ్చల్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధి లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో శిక్షణలో ఉన్న విమాన పైలట్ శ్రీకరన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న శ్రీకరన్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీకరన్ రెడ్డి స్వస్థలం గజ్వేల్.
నేరెడ్ మీట్ ప్రాంతంలో శ్రీకరన్ రెడ్డి కుటుంబ సభ్యులు స్థిరపడ్డారు. బ్యాంకాక్ లో శిక్షణ పొందుతున్న పైలట్ శ్రీకారన్ రెడ్డి, గత వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చాడు. యాదగిరిగుట్టకు వెళ్లి వస్తా అని ఇంట్లో చెప్పి ఇవాళ తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయలుదేరాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులుకేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదానికి గురైన కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఏదైనా వాహనానికి కారు ఢీ కొట్టిందా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు. కొడుకు మరణించడన్న వార్త వినగానే శ్రీకారన్ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.