దారుణం.. ప్రశ్నించినందుకు ఆర్టీఐ కార్యకర్తను కొట్టి చంపారు

RTI activist beaten to death for making queries. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలో జరుగుతున్న ప్రజా ప్రాజెక్టుల నాణ్యతను

By అంజి  Published on  29 Nov 2022 4:42 AM GMT
దారుణం.. ప్రశ్నించినందుకు ఆర్టీఐ కార్యకర్తను కొట్టి చంపారు

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలో జరుగుతున్న ప్రజా ప్రాజెక్టుల నాణ్యతను ప్రశ్నించినందుకు ఆర్టీఐ కార్యకర్తను గ్రామపెద్ద, అతని కొడుకు సహా ఎనిమిది మంది వ్యక్తులు కొట్టి చంపారు. ఈ ఘటనలో బాధితుడి సోదరుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇగ్లాస్ పోలీస్ సర్కిల్ పరిధిలోని గొరై గ్రామంలో నివాసం ఉంటున్న దేవ్‌జీత్ సింగ్ (32), తన సోదరుడు తమ పొలంలో పని చేస్తుండగా హత్యకు గురైనట్లు బాధిత కుటుంబీకులు పోలీసులకు తెలిపారు.

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాఘవేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ''ఈ ఫిర్యాదులో గ్రామపెద్ద దేవేంద్ర సింగ్, అతని కుమారుడు కార్తీక్, ఆరుగురిపై 302 (హత్య), 147 (అల్లర్లు), 506 (అల్లర్లు), నేరపూరిత బెదిరింపు) సహా ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. నిందితులు పరారీలో ఉన్నారు'' అని చెప్పారు.

దేవ్‌జీత్ తండ్రి మహేంద్ర సింగ్ మాట్లాడుతూ.. "గ్రామ పెద్ద చేసిన అభివృద్ధి పనుల నాణ్యతపై సమాచారం కోసం నా కుమారుడు రెండు నెలల క్రితం ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేశాడు. గ్రామంలో నిర్మాణాలకు నాసిరకం మెటీరియల్‌ను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ వివిధ అధికారులకు పలు ఫిర్యాదులు కూడా చేశాడు. తగు చర్యలు తీసుకోవాలని కోరాడు. అప్పటి నుంచి మాకు హత్య బెదిరింపులు వస్తున్నాయి. దేవేంద్రపై ఫిర్యాదు చేసేందుకు గత నెలలో పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు'' అని చెప్పారు.

బాధితురాడి మేనమామ రాంవీర్ సింగ్ మాట్లాడుతూ.. "గ్రామ పెద్ద, అతని బంధువులు నా మేనల్లుళ్లపై లాఠీలు, పదునైన ఆయుధాలతో పాశవికంగా దాడి చేశారు. దాడి గురించి తెలుసుకున్న మేము సంఘటనా స్థలానికి చేరుకున్నాము. దేవ్‌జీత్ తలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. అతను మరణించాడు. అతని తమ్ముడు సురేంద్ర పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు" అని తెలిపారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవ్‌జీత్‌ తన తండ్రి వ్యవసాయ పనులతో పాటు గ్రామంలో కంప్యూటర్‌ సెంటర్‌ను నడుపుతున్నాడు. అతనికి 28 ఏళ్ల భార్య, ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు.

Next Story