రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బీబీగూడ వద్ద చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు- కారు ఢీకొని దంపతులు, ఎనిమిదేళ్ల కుమార్తె ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను గడ్డం రవీందర్, రేణుక, రితిక(8)గా గుర్తించారు.
ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కారు పరస్పరం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. పెద్ద శబ్దం రావడంతో హుటాహుటిన స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను ఏరియా హాస్పిటల్కు తరలించారు. బస్సు, కారు వేగంగా రావడం, మలుపు తీసుకొనే క్రమంలో కారు అదుపు తప్పి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. కారు వెనుక భాగంలో కూర్చొన్న రేణుక, రితిక.. డ్రైవర్ పక్కన కూర్చొన్న రవీందర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాద ఛాయలు అలముకున్నాయి.