తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోర్టు ఆవరణలో ఎస్కార్ట్ పోలీసులను తప్పుదారి పట్టించి రిమాండ్ ఖైదీ తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ అనే వ్యక్తి, గల్ఫ్కు పంపిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల్లో అరెస్ట్ అయిన ప్రసాద్, ప్రస్తుతం జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవలే ఇతనిపై కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో మరో కేసు కూడా నమోదైంది.
ఈ కొత్త కేసుకు సంబంధించి విచారణలో భాగంగా, కొడిమ్యాల పోలీసులు నిన్న పీటీ వారెంట్పై జున్ను ప్రసాద్ను జగిత్యాల సబ్ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. కేసు వివరాలను పరిశీలించిన సంబంధిత మేజిస్ట్రేట్, ప్రసాద్కు రిమాండ్ విధించారు. కోర్టు ప్రక్రియ ముగిసిన అనంతరం, ప్రసాద్ను బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో కోర్టు ఆవరణలో ఉన్న తన కుటుంబ సభ్యులతో ప్రసాద్ మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో, ఎస్కార్ట్గా వచ్చిన కానిస్టేబుల్ సాగర్, రిమాండ్ వారెంట్ తీసుకునేందుకు కోర్టు లోపలికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన జున్ను ప్రసాద్ కానిస్టేబుల్ సాగర్ కళ్లుగప్పి అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు. కొద్దిసేపటికే విషయం గ్రహించిన పోలీసులు అప్రమత్తమై, పరారైన ఖైదీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.