హైదరాబాద్లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒక భారీ కుట్ర బయటపడింది. అలీ కేఫ్ సమీపంలో ఎస్.ఐ. అంజి రెడ్డి మరియు క్రైమ్ టీమ్ సభ్యులు తనిఖీలు చేపడుతుండగా, ఒక తెల్ల రంగు ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆపి సోదా చేశారు. ఆ వాహనం డిక్కీలో ఒక దేశీయ తుపాకీతో పాటు ఆరు లైవ్ కార్ట్రిడ్జ్లు లభించడంతో పోలీసులు విస్తుపోయారు.
వాహనాన్ని నడుపుతున్న వ్యక్తిని మల్కాజిగిరి మారుతి నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధమర అరుణ్ కుమార్గా గుర్తించారు. తన రెండో భార్య నిషితా రాణిని హత్య చేసేందుకే ఈ ఆయుధాన్ని సమకూర్చుకున్నట్లు అతను విచారణలో అంగీకరించాడు. ఈ ఆయుధ సేకరణలో మల్కాజిగిరికి చెందిన మహమ్మద్ అబ్బు, యాకుత్పురకు చెందిన మీర్ ముజమ్మిల్ సహాయం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ముజమ్మిల్ బీహార్లోని ముంగేర్ నుంచి ఈ తుపాకీని, బుల్లెట్లను కొనుగోలు చేసి తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. నిందితుడి నుంచి తుపాకీ, బుల్లెట్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనం మరియు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.