ఆంధ్ర, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి.. ఐఎస్ఐఎస్ మోడల్ ఆపరేషన్ భగ్నం చేశారు. హైదరాబాదులో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. విజయనగరంకు చెందిన సిరాజ్, హైదరాబాద్ నగరానికి చెందిన సమీర్ ఇద్దరు కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే సిరాజ్, సమీర్ ఇద్దరు కలిసి విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు. సౌదీ అరేబియా నుండి ఐఎస్ఐఎస్ మాడ్యూల్ సిరాజ్, సమీర్ కు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ఆంధ్ర ఇంటలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించి ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు.
విజయనగరం పోలీసులకు వచ్చిన సమాచారంతో నగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ (29) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సిరాజ్ ఉర్ రెహ్మాన్ ఇచ్చిన సమాచారంతో ఓ ఇంటిలో తనిఖీలు నిర్వహించగా, అక్కడ పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ లభించింది. విచారణలో రెహ్మాన్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ కు చెందిన మరో వ్యక్తి సయ్యద్ సమీర్ (28) కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని కోర్టులో హాజరుపర్చనున్నట్లుగా అధికారులు తెలిపారు.