పూణేలోని ఒక బాలల గృహంలో 11 ఏళ్ల ఇద్దరు విద్యార్థినిలపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై 55 ఏళ్ల ప్యూన్ రమేష్ దగ్డు సాథే అరెస్టు చేయబడ్డాడు. ఈ సంఘటన జూన్ 7న జరిగింది, కానీ బాధితులు ఆశ్రయం యాజమాన్యానికి చెప్పిన తర్వాతే ఈ ఘటన బయటపడింది. పోలీసు నివేదికల ప్రకారం.. సాథే మైనర్ల చేతులను కట్టివేసి, వారి నోటిలో గుడ్డను నింపి లైంగికంగా వేధించాడని, ఈ సంఘటన గురించి చెబితే చంపేస్తానని పిల్లలను బెదిరించాడని ఆరోపించారు.
ఈ కేసు మొదట ఘోడేగావ్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. కానీ తరువాత లోనికాండ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేయబడింది. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదు చేయబడింది. సహ్యాద్రి ఆదివాసీ గ్రామీణ వికాస్ ప్రతిష్ఠాన్ అనే ఆశ్రయం నిర్వహిస్తున్న దాని మేనేజర్.. బాధిత పిల్లల్లో చెదిరిన ప్రవర్తన, ఆహారం తినకపోవడాన్ని గమనించాడు. సున్నితంగా ప్రశ్నించిన తర్వాత, బాధితులు జరిగిన దాడిని వెల్లడించడంతో, మేనేజర్ అధికారులకు సమాచారం అందించారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఆదేశాల మేరకు ఆశ్రయంలో ఉంచబడిన పిల్లలు, గాయం నుండి కోలుకోవడానికి ఇప్పుడు కౌన్సెలింగ్ పొందుతున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిమ్మత్ జాదవ్ అరెస్టును ధృవీకరించారు. న్యాయం జరిగేలా దర్యాప్తు జరుగుతుందని హామీ ఇచ్చారు.