బాలిక‌పై అత్యాచారం చేసిన ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష.. స‌హ‌క‌రించిన టీచ‌ర్‌కు జీవిత ఖైదు

Patna School Principal Sentenced To Death For Rape Of Student. కీచ‌క‌ ప్రిన్సిపాల్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది.

By Medi Samrat  Published on  16 Feb 2021 5:53 AM GMT
Patna School Principal Sentenced To Death For Rape Of Student

కీచ‌క‌ ప్రిన్సిపాల్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. తమ స్కూళ్లో చదువుతున్న బాలికపై అత్యాచారం చేసినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. వివ‌రాళ్లోకెళితే.. బీహార్ రాష్ట్రం పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో 11 సంవత్సరాల బాలిక 5వ తరగతి చదువుతోంది. ఆ పాఠశాలలో అభిషేక్ కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండ‌గా.. ప్రిన్సిపాల్‌ అరవింద్ కుమార్.

అయితే ప్రిన్సిపాల్ అరవింద్ కుమార్.. బాలికపై 2018 సెప్టెంబర్ లో అత్యాచారం చేశాడు. బాలికను బెదిరిస్తూ పలుమార్లు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రిన్సిపాల్ దుశ్చ‌ర్య‌కు.. టీచర్‌గా పనిచేస్తున్న అభిషేక్ కుమార్ సహకరించాడు. కొన్న రోజుల త‌ర్వాత బాలిక అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ బాలిక‌కు వైద్యులు పరీక్షలు చేయగా.. గర్భవతి అని తేలింది. దీంతో అసలు విషయం బయటపడింది.

వెంట‌నే బాలిక‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. ప్రిన్సిపాల్‌ను, టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి పాట్నా కోర్టు తాజాగా ప్రిన్సిపాల్‌కు మరణశిక్షను విధిస్తూ తీర్పు వెల్ల‌డించింది. అలాగే లక్ష రూపాయల ఫైన్ కూడా విధించింది. ప్రిన్సిపాల్‌కు సహకరించిన ఉపాధ్యాయుడికి జీవిత ఖైదు శిక్ష వేయ‌డంతో పాటు రూ. 50,000 జరిమానా విధించారు.


Next Story