హోలీ పూట యాదాద్రి జిల్లాలో విషాదం..ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
By - Knakam Karthik |
హోలీ పూట యాదాద్రి జిల్లాలో విషాదం..ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ పచ్చని సంసారం ఛిన్నాభిన్నమైంది. భర్తతో ఉన్న తీవ్ర మనస్పర్థల వల్ల మనస్తాపానికి గురైన ఓ తల్లి, తన ఇద్దరు బిడ్డలను కడతేర్చి, ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసుల కథనం ప్రకారం.. గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్ యాదవ్, ఐశ్వర్య దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విభేదాల కారణంగా ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే సోమవారం రోజునే ఆమె కుటుంబ సభ్యులు దంపతులకు నచ్చజెప్పి, ఐశ్వర్యను తిరిగి అత్తగారి ఇంటికి పంపించారు.
పుట్టింటి నుంచి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ ఘోరం జరగడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను ఐశ్వర్య దిండుతో ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. అనంతరం అదే ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని తాను కూడా తనువు చాలించింది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలే ఈ దారుణానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో గొల్లగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.