యాత్రికులే టార్గెట్‌.. బద్రీనాథ్‌లో బట్టబయలైన భారీ మోసం..!

బద్రీనాథ్‌లో భారీ మొబైల్ ఫోన్ మోసం ముఠా బట్టబయలైంది. ఈ ముఠాలోని యువకులు యాత్రికుల‌ను టార్గెట్ చేసుకుని పలు సాకులు చూపి అధిక ధరలకు నకిలీ మొబైల్ ఫోన్లను ప్రయాణికులకు విక్ర‌యించి డ‌బ్బులు దండుకునేవారు.

By Medi Samrat
Published on : 31 May 2025 2:54 PM IST

యాత్రికులే టార్గెట్‌.. బద్రీనాథ్‌లో బట్టబయలైన భారీ మోసం..!

బద్రీనాథ్‌లో భారీ మొబైల్ ఫోన్ మోసం ముఠా బట్టబయలైంది. ఈ ముఠాలోని యువకులు యాత్రికుల‌ను టార్గెట్ చేసుకుని పలు సాకులు చూపి అధిక ధరలకు నకిలీ మొబైల్ ఫోన్లను ప్రయాణికులకు విక్ర‌యించి డ‌బ్బులు దండుకునేవారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి 14 నకిలీ మొబైల్ ఫోన్లు, నకిలీ బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. యాత్రకు వచ్చిన‌వారికి బలవంతంగా నకిలీ లేదా ట్యాంపర్ చేసిన మొబైల్ ఫోన్‌లను అధిక ధరలకు విక్రయించేవారని పోలీసులు చెప్పారు. అరెస్టయిన నిందితుల్లో ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. బద్రీనాథ్‌ ధామ్‌ తలుపులు తెరిచినప్పటి నుంచి నకిలీ మొబైల్‌లు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న కేసులు తెరపైకి వస్తున్నాయని పోలీసులు చెప్పారు. అయితే ఈ ముఠా గురించి పోలీసులకు సరైన సమాచారం లేదు.

బద్రీనాథ్‌కు చెందిన శశాంక్ బిష్త్ అనే వ్యక్తి బద్రీనాథ్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో మే 27న ఓ వ్యక్తి ఒప్పో మొబైల్ ఫోన్‌ను రూ.11,000కు తనకు విక్రయించాడని.. తన బలవంతం కారణంగా బిల్లు కూడా ఇచ్చాడని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజు ఫోన్ ఆపరేట్ చేయడంలో విఫలమవడంతో ఫోన్‌ని తనిఖీ చేయ‌గా.. ఫోన్‌లోని IMEI నంబర్, కంపెనీ ఫోన్‌లో ప్రింట్ చేసిన దానికి భిన్నంగా ఉన్నట్లు కనుగొని.. మోసపోయానని నిర్ధారించుకున్నాడు. ఫిర్యాదు ఆధారంగా కొత్వాలి శ్రీ బద్రీనాథ్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. బద్రీనాథ్ ధామ్‌లో భక్తులుగా నటిస్తూ ప్రయాణీకులను లక్షల రూపాయలను మోసం చేసిన కేసుల్లో బయటి ముఠా ప్రమేయం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసుల చురుకైన విచారణతో ముఠాలోని ఆరుగురు సభ్యులను పట్టుకున్నారు.

ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని గఫార్ మార్కెట్‌లోని హాకర్ల నుండి వివిధ కంపెనీలకు చెందిన పాత లేదా తక్కువ నాణ్యత గల మొబైల్ ఫోన్‌లను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేసేవారని విచారణలో తేలింద‌ని పోలీసులు తెలిపారు. దీని తర్వాత వారు ఈ ఫోన్‌ల నకిలీ బిల్లులను తయారు చేసేవారు. ఆ త‌ర్వాత యాత్రికుల‌ను టార్గెట్ చేసుకుని.. జేబు దొంగిలించారు.. పర్సు పోగొట్టుకున్నా.. భార్య‌తో విడిపోయాను వంటి క‌థ‌లు అల్లుతారు. ఈ సాకుల‌తో నిందితులు ఆ ఫోన్‌లను అమాయ‌క ప్రజలకు విక్రయించేవారు. ఇలా ప్రజలను మోసం చేస్తూ భారీగా లాభాలు పొందేవారు.

బద్రీనాథ్ పోలీసుల చర్యతో ఆ ప్రాంతంలో ఈ దుండగుల ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు బట్టబయలు అయిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ఈ నిందితులు ఇతర మోసాల కేసుల్లో ప్రమేయం ఉన్నారనే కోణంలో కూడా విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. బలవంతంగా లేదా ఏ విధమైన ఆకర్షణీయమైన ఆఫర్‌ను సాకుగా చూపే తెలియని వ్యక్తి నుండి ఎటువంటి వస్తువులను కొనుగోలు చేయవద్దని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయ‌న‌ విజ్ఞప్తి చేశారు.

Next Story