మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నంబాల గ్రామంలో చోటు చేసుకున్న చిన్నారి హత్యాచార కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాలికకు పెద్దనాన్న అయ్యే వ్యక్తే మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. నవంబర్ 24వ తేదీన బాలిక మృతదేహం బావిలో లభ్యం కావడంతో ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేశారు పోలీసులు.
ఈ క్రమంలో బాలికకు పెద్దనాన్న అయిన శనిగారపు బాపు (52), మరో వ్యక్తి ఉప్పారపు సతీశ్ (40) ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు తామే నేరం చేసినట్లు అంగీకరించారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారికి కుర్కురే ప్యాకెట్ కొనిస్తామని ఆశ చూపి, సమీపంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లామని నిందితులు తెలిపారు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి, ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే భయంతో గొంతు నులిమి హత్య చేశామని ఒప్పుకున్నారు. మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేశారు.