తన కుమార్తె షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో కలత చెంది.. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెలను హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకుని మరణించాడని పోలీసులు తెలిపారు. నాగపట్నం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి జవహర్ మాట్లాడుతూ.. టీ దుకాణం నడుపుతున్న లక్ష్మణన్ తన పెద్ద కుమార్తె షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంపై కోపంగా ఉన్నాడు. ప్రస్తుతం భర్తతో కలిసి ఉంటున్న కూతురు క్షేమంగా ఉంది. ఈ దారుణ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
కులాంతర వివాహాలపై కుల వివక్ష, బంధువుల దాడులు తమిళనాడులోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రబలంగా కొనసాగుతున్నాయి. 2016లో, తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని ఉడుమల్పేట్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక యువకుడిని పట్టపగలు అతని అగ్రవర్ణ హిందూ భార్య కుటుంబం దారుణంగా హత్య చేయించింది. హంతకులు 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి వి శంకర్ను నరికి చంపారు. అతని భార్య కౌసల్యను తీవ్రంగా గాయపరిచారు. కౌసల్య తండ్రి చిన్నస్వామి సహా ఆరుగురికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. తర్వాత 2020లో, మద్రాసు హైకోర్టు మహిళ తండ్రిని నిర్దోషిగా ప్రకటించింది. మిగిలిన వారికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.