మ‌ల‌క్‌పేట్ హిట్ అండ్ ర‌న్ కేసు.. చికిత్స పొందుతూ డాక్ట‌ర్ శ్రావ‌ణి మృతి

Malakpet hit run case Dr Sravani died.తీవ్రంగా గాయ‌ప‌డిన డాక్ట‌ర్ శ్రావ‌ణి శ‌నివారం తెల్ల‌వారుజామున క‌న్నుమూసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sep 2022 6:14 AM GMT
మ‌ల‌క్‌పేట్ హిట్ అండ్ ర‌న్ కేసు.. చికిత్స పొందుతూ డాక్ట‌ర్ శ్రావ‌ణి మృతి

మ‌ల‌క్‌పేట హిట్ అండ్ ర‌న్ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన డాక్ట‌ర్ శ్రావ‌ణి శ‌నివారం తెల్ల‌వారుజామున క‌న్నుమూసింది. గ‌త మూడు రోజులుగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న శ్రావ‌ణి ప‌రిస్థితి విష‌మించ‌డంతో మ‌ర‌ణించింది. ప్ర‌మాదంలో త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతోనే చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. కాగా.. శ్రావ‌ణి కుటుంబంతో నెల రోజుల వ్య‌వ‌ధిలో ఇది రెండో విషాదం. 25 రోజులు కింద‌టే శ్రావ‌ణి వాళ్ల అమ్మ గుండెపోటుతో మ‌ర‌ణించింది. నెల‌రోజుల్లోనే త‌ల్లీ, కూతురు మ‌ర‌ణించ‌డంతో ఆ ఇంట్లో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

హస్తినాపురంలోని ఓ డెంటల్ ఆస్ప‌త్రిలో శ్రావ‌ణి డాక్ట‌ర్‌గా ప‌ని చేస్తోంది. ఈ నెల 21న ఓలా బైక్ బుక్ చేసుకుని వెలుతుండ‌గా.. గుర్తు తెలియ‌ని కారు వేగంగా వ‌చ్చి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బైక్ డ్రైవ‌ర్ వెంక‌ట‌య్య‌, శ్రావ‌ణి గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ శ్రావ‌ణి తుదిశ్వాస విడిచింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించారు. ప్ర‌మాద స‌మ‌యంలో కారును న‌డిపింది ఓల్డ్ మ‌ల‌క్‌పేట‌కు చెందిన ఇబ్ర‌హీంగా గుర్తించారు. అత‌డికి లైసెన్స్ లేద‌ని, కారుకు పేపర్లు లేవ‌ని స‌మాచారం.

Next Story