భార్యను బావిలో వేలాడదీసిన భర్త.. ఆ వీడియోను బావమరిదికి పంపించి..

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కట్నం కోసం తన భార్యను బావిలో వేలాడదీశాడు. ఈ క్రమంలో వీడియో తీసి తన బావమరిదికి పంపించాడు.

By అంజి  Published on  6 Sep 2023 6:55 AM GMT
Madhya Pradesh, man hangs wife in well, dowry, Crime news

భార్యను బావిలో వేలాడదీసిన భర్త.. ఆ వీడియోను బావమరిదికి పంపించి..

కాలం మారినా.. మనుషుల్లో మార్పు రావడం లేదు. ఇంకా కొందరు కట్నం కోసం క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కట్నం కోసం తన భార్యను బావిలో వేలాడదీశాడు. ఈ క్రమంలో వీడియో తీసి తన బావమరిది అంటే భార్య సోదరుడికి పంపించాడు. తన బావమరిది నుంచి మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కట్నం డిమాండ్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన 40 సెకన్ల వీడియోలో, ఆ మహిళ తనను రక్షించమని వేడుకుంటోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆగస్ట్ 20న జరిగిన ఈ సంఘటన నీముచ్ పట్టణంలో జరిగింది. పోలీసులు నిందితుడిని రాకేష్ కీర్‌గా గుర్తించారు. కట్నం కోసం రాకేష్ తన భార్య ఉషను బావిలో వేలాడదీసి మొత్తం వీడియో తీశాడని చెబుతున్నారు. తెలిసిన వివరాల ప్రకారం.. నిందితుడు రాకేష్ తన భార్య బంధువులు, సన్నిహితులకు వీడియోను పంపాడు. కట్నం డిమాండ్ చేశాడు. మరోవైపు ఈ వీడియోను చూసిన బాధిత మహిళ బంధువులు పోలీసులకు సమాచారం అందించగా, నిందితుడు రాకేష్‌ను అరెస్టు చేశారు.

బాధితురాలు రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ నివాసి

సమాచారం ప్రకారం.. రాకేష్, ఉష దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. రాకేష్ మధ్యప్రదేశ్‌లోని జవాద్‌లోని కిర్‌పూర్ నివాసి కాగా, ఉష రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా నివాసి. నిందితుడు వీడియో తీసి ఉష బంధువులకు పంపగా.. ఘటనపై తొలుత స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కేసుకు సంబంధించిన సమాచారం అందుకున్న ప్రతాప్‌గఢ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసు బృందం ఉష అత్తమామ ఇంటికి చేరుకుంది. పోలీసులు రావడంతో బాధితురాలు ఉష తన భర్త రాకేష్‌పై జావాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఇటీవల రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన గిరిజన మహిళపై వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మహిళ భర్త, ఇతర నిందితులతో కలిసి ఆమెను వివస్త్రను చేసి వీధుల్లో ఊరేగించారు.

Next Story