ల‌వ్ రివేంజ్‌.. అహ్మదాబాద్ మెడిక‌ల్ కాలేజీ స‌హా 12 రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులకు పాల్పడిన యువతి

కొంతకాలం క్రితం గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంకు బాంబుతో బెదిరింపులు వచ్చాయి.

By Medi Samrat
Published on : 24 Jun 2025 6:24 PM IST

ల‌వ్ రివేంజ్‌.. అహ్మదాబాద్ మెడిక‌ల్ కాలేజీ స‌హా 12 రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులకు పాల్పడిన యువతి

కొంతకాలం క్రితం గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంకు బాంబుతో బెదిరింపులు వచ్చాయి. దీని తరువాత, అహ్మదాబాద్‌లోని రెండు పాఠశాలలు, బీజే మెడికల్ కాలేజీల‌కు కూడా బాంబు పేలుడు హెచ్చరికలు వ‌చ్చాయి. ఈ బెదిరింపులన్నీ ఈమెయిల్ ద్వారానే వ‌చ్చాయి. ఈమెయిల్ పంపిన వారి కోసం గుజరాత్ పోలీసులు నెలల తరబడి వెతకగా.. పోలీసుల సోదాలు ముగిసే సరికి అసలు విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు.

ఈమెయిల్ పంపింది ఓ అమ్మాయి.. అందుకే అంతా షాక‌య్యారు.. అమె పేరు రెనే జోషిల్డా.. ఆమె చెన్నైలోని ఓ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కూడా జోషిల్డా బీజే మెడికల్ కాలేజీకి బెదిరింపు మెయిల్ పంపింది. అయితే.. ఆమె చేసిన పొరపాటు వల్ల ఆమె ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారు.

జోషిల్డా నకిలీ IDని సృష్టించి VPN, డార్క్ వెబ్ సహాయంతో ఈ బెదిరింపు ఈ-మెయిల్‌లను పంపింది. చెన్నైలో నివసిస్తున్న జోషిల్డా.. గుజరాత్‌కే కాకుండా 11 రాష్ట్రాలకు కూడా బాంబు బెదిరింపులు పంపింది. మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్, తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో 12 రాష్ట్రాల పోలీసులు జోషిల్డా కోసం వెతుకుతున్నారు.

జూన్ 12న అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ భవనంపై విమానం కూలినప్పుడు.. జోషిల్డా మళ్లీ బెదిరింపు ఈమెయిల్ పంపింది. వైద్య కళాశాలకు పంపిన ఈ ఇమెయిల్‌లో జోషిల్డా ఇలా రాసింది. బహుశా ఇప్పుడు మీకు నా బలం గురించి ఒక ఆలోచన వచ్చింది. మేము ఒక రోజు క్రితం మీకు ఇమెయిల్ పంపాము.. ఈ రోజు మేము ఎయిర్ ఇండియా విమానాన్ని క్రాష్ చేసాము. ఈ ఈమెయిల్ నకిలీదని పోలీసులు భావించారని.. మీరు ఈ బెదిరింపు విస్మరించారని మాకు తెలుసు. ఇప్ప‌టికైనా మేము తమాషా చేయడం లేదని మీకు అర్థమై ఉంటుంది.

జోషిల్డా.. నరేంద్ర మోదీ స్టేడియంకు 13, జెనీవా లిబరల్ స్కూల్‌కు 4, దివ్య జ్యోతి స్కూల్‌కు 3, బీజే మెడికల్ కాలేజీకి 1 బాంబు బెదిరింపు మెయిల్స్ పంపింది. జూన్ 3, 2025న పాఠశాల ఫిర్యాదుపై సర్ఖేజ్ పోలీస్ స్టేషన్‌లో ఈమెయిల్ పంపిన వ్యక్తిపై ఫిర్యాదు నమోదు చేయబడింది. సైబర్ పోలీసులు ఆ వ్య‌క్తి కోసం వెతకడం ప్రారంభించారు.

పోలీసు అధికారి శరద్ సింఘాల్ ప్రకారం.. "జోషిల్డా.. దివిజ్ ప్రభాకర్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. అతనిని వివాహం చేసుకోవాలనుకుంది. అయితే జోషిల్డాది వన్ సైడ్ ల‌వ్‌. ఆమెతో పెళ్లికి నిరాకరించి ప్రభాకర్ ఫిబ్రవరిలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో.. దివిజ్‌ ప్రభాకర్ ను ట్రాప్ చేయడానికి జోషిల్డా అతని పేరుతో నకిలీ ఇమెయిల్ ఐడీని సృష్టించి, 12 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు బెదిరింపు ఈమెయిల్‌లు పంపింది.

రెనే జోషిల్డా 2022 నుండి చెన్నైలోని ఒక ప్రముఖ కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్‌గా ప‌ని చేస్తుంది. ఆమె రోబోటిక్స్ ఇంజనీర్. ఆమె సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రభాకర్‌ను ట్రాప్ చేయడానికి ప్లాన్ చేసింది. ఎట్ట‌కేల‌కు అహ్మదాబాద్ పోలీసులు జోషిల్డాను చెన్నైలోని ఆమె ఇంటి వ‌ద్ద‌ అరెస్టు చేశారు.

Next Story