రూ.కోటి కోసం.. చిన్ననాటి ఫ్రెండ్ని చంపిన లాయర్
రాజస్థాన్లోని జైపూర్లో తన చిన్ననాటి స్నేహితుడిని అపహరించి చంపినందుకు ఒక న్యాయవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు
By అంజి Published on 26 May 2023 8:30 AM IST
రూ.కోటి కోసం.. చిన్ననాటి ఫ్రెండ్ని చంపిన లాయర్
రాజస్థాన్లోని జైపూర్లో తన చిన్ననాటి స్నేహితుడిని అపహరించి చంపినందుకు ఒక న్యాయవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. మృతదేహాన్ని పారవేసేందుకు నిందితుడికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు దివాకర్ టోంక్ తన చిన్ననాటి స్నేహితుడు హనుమంత్ మీనాను కిడ్నాప్ చేసి, వదిలిపెట్టేందుకు అతని కుటుంబం నుండి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. కుటుంబ సభ్యులు కోరిన మొత్తం చెల్లించకపోవడంతో నిందితుడు తన చిన్ననాటి స్నేహితుడిని హత్య చేశాడు. నిందితులు బాధితుడి మృతదేహాన్ని ద్రవవతి నదిలో పడేశారు.
జైపూర్ అడిషనల్ పోలీస్ కమిషనర్ కైలాష్ చంద్ర విష్ణోయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మే 22న మీనా ఉద్యోగానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మీనా శారీరక వేధింపులకు గురవుతున్నట్లు చూపించే వీడియో అతని కుటుంబానికి అందింది. అతడిని విడిచి పెట్టేందుకు కిడ్నాపర్లు కోటి రూపాయలు డిమాండ్ చేశారు. కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ దివాకర్ తన సహచరులైన యోగేంద్ర సింగ్ (పింటూ), బ్రిజ్భన్ సింగ్లతో కలిసి కిడ్నాప్కు కుట్ర పన్నినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ముగ్గురూ మీనాను చంపి, అతని మృతదేహాన్ని ద్రవవతి నదిలో విసిరే ముందు ఇనుప బరువులు, ప్లాస్టిక్ సంచిని ఉపయోగించి అతని మృతదేహాన్ని పారవేసారు. హనుమాన్ మీనా అవశేషాలను మే 25న స్వాధీనం చేసుకున్నారు.