హైదరాబాద్‌లో ఘోరం.. మహిళపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో మృతి

హైదరాబాద్‌ నగరంలో మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. ముసాపేట్‌ వై జంక్షన్‌ దగ్గర చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.

By అంజి  Published on  22 April 2024 8:46 AM GMT
Hyderabad, Crime, Kukatpally

హైదరాబాద్‌లో ఘోరం.. మహిళపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో మృతి

హైదరాబాద్‌ మహా నగరంలో మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముసాపేట్‌ వై జంక్షన్‌ దగ్గర చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే 45 ఏళ్ల మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. తీవ్రరక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మరణించింది. ఘటన జరిగిన పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. సదరు మహిళతో ఇద్దరు యువకులు మాట్లాడారు. అనంతరం ఆమెను బలవంతంగా స్థానిక దుకాణం సెల్లార్‌లోకి లాక్కెళ్లినట్టుగా తేలింది. ఆ సమయంలోనే మహిళపై అత్యాచారం చేసి పారిపోయారు. ఫలితంగా అధిక రక్తస్రావంతో ఆమె ఘటన స్థలంలోనే కన్నుమూసింది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ అమానుష ఘటన జరిగింది.

ఆదివారం ఉదయం బిల్డింగ్‌ సెల్లార్‌లోని ఒక షట్టర్‌ ముందు గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా.. మృతురాలి శరీరంపై దుస్తులు అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు తీవ్రస్థాయిలో రక్తస్రావమైనట్లు ఆనవాళ్లను గుర్తించారు. వేలిముద్రల నిపుణులు, జాగిలాల బృందం సభ్యులు ఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించారు. కూకట్‌పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, సీఐ కృష్ణమోహన్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి మహిళ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story