మిస్సింగ్ కాదు.. భార్యే కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించింది
మేఘాలయకు హనీమూన్కు వెళ్లిన ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు మిస్టరీ వీడింది.
By Medi Samrat
మేఘాలయకు హనీమూన్కు వెళ్లిన ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు మిస్టరీ వీడింది. భర్తను హత్య చేయించి తప్పించుకు తిరుగుతున్న భార్య సోనమ్ రఘువంశీని ఘాజీపూర్లోని ధాబాలో పోలీసులు అరెస్టు చేశారు. సోనమ్ తన తల్లికి ఫోన్ చేసి తన లొకేషన్ చెప్పిందని, తాను ఘాజీపూర్లో ఉన్నానని, ధాబా వద్ద ఉన్నానని, వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లాలని చెప్పింది. ఈ సమాచారంతో అపస్మారక స్థితిలో ఉన్న సోనమ్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు.
రాజా, సోనమ్ హనీమూన్ కోసం షిల్లాంగ్ వెళ్ళగా.. అక్కడ భర్తను సుఫారీ ఇచ్చి హత్య చేయించింది సోనమ్. ఆ తర్వాత జూన్ 2న రాజా మృతదేహం లభించింది.. అప్పటి నుంచి సోనమ్ ఆచూకీ లభించలేదు. తాజాగా సోనమ్ ఆచూకీ లభించగా.. ఈ విషయమై మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా స్పందించారు. ఆయన మేఘాలయ పోలీసుల విజయాన్ని కొనియాడారు.
పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా సీబీఐ విచారణ జరిపి, తన కుమార్తెను కనుగొని ఇంటికి తీసుకురావాలని తల్లి మీడియా ద్వారా కోరింది. కానీ ఈ కథ ట్రెండ్ మారింది.. సోనమ్ స్వయంగా తన తల్లికి ఫోన్ చేసి ఘాజీపూర్లోని ఒక దాబాలో ఉన్నానని చెప్పింది. తనను అక్కడి నుంచి తీసుకెళ్లాలని కోరింది.. కానీ ఈలోపే ఘాజీపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
హత్య కేసులో ముగ్గురు సుఫారీ నిందితులను మేఘాలయ పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ కేసులో 1 మహిళతో సహా మొత్తం నలుగురు నిందితుల ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి, పోలీసులు నిందితులందరినీ ఒకచోట చేర్చి ముఖాముఖి విచారిస్తున్నారు. తద్వారా నిజం బయటపడనుంది.
సోనమ్ను అదుపులోకి తీసుకున్న ఇండోర్ పోలీసు బృందం తదుపరి విచారణ కోసం ఘాజీపూర్కు చేరుకుంది. సోనమ్ అరెస్ట్, వైద్య పరీక్షలు మర్డర్ మిస్టరీలో అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే పూర్తి నిజానిజాలు బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కేసులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, నిందితులందరికీ శిక్ష పడుతుందని పోలీసులు స్పష్టం చేశారు.