38 రోజుల్లో 234 కాల్స్.. రాజా రఘువంశీ హత్య కేసులో మరో వ్యక్తి పాత్ర
ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
By Medi Samrat
ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మరో పాత్ర చేరింది. సోనమ్ కాల్ వివరాలను పోలీసులు విచారించారు. కాల్ డిటెయిల్స్లో షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందు రాజ్తో పాటు సోనమ్ మరొకరితో కూడా సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. ఆ వ్యక్తి పేరు సంజయ్ వర్మ అని తెలుస్తోంది. మార్చి 1, ఏప్రిల్ 8 మధ్య సోనమ్ సంజయ్ వర్మకు చాలా సార్లు కాల్ చేసింది. 38 రోజుల్లో సోనమ్ సంజయ్ వర్మకు 234 సార్లు కాల్ చేసింది. సోనమ్ ఆ నంబర్ను సంజయ్ వర్మ హోటల్ పేరుతో సేవ్ చేసుకుంది.
రాజా రఘువంశీ హత్య కేసులో రాజ్ కుష్వాహతో పాటు మరికొందరి హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. సంజయ్ వర్మ ఎవరనేది ఆరా తీస్తున్నారు. రాజా హత్య జరిగినప్పటి నుంచి సంజయ్ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది.
అయితే.. రాజా హత్యకు రాజ్, సోనమ్ కుట్ర పన్నారు. వారిద్దరూ సంజయ్ వర్మ పేరిట మొబైల్ నంబర్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. హత్యకు ప్లాన్ చేసి.. సంజయ్ వర్మ పేరిట ఓ నంబర్ తీసుకుని ఉండొచ్చని, హత్య జరిగిన తర్వాత పోలీసుల విచారణ తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉందన్నారు.
ఇదిలావుంటే.. షిల్లాంగ్లో రాజాను హత్య చేసేందుకు వచ్చిన విశాల్, ఆకాష్, ఆనంద్లు కూడా కొత్త సిమ్లు తీసుకున్నట్లు విచారణలో తేలింది. రాజాను హత్య చేసిన తర్వాత ముగ్గురు నిందితులు నంబర్స్ స్విచ్ ఆఫ్ చేసి సిమ్లను విసిరేశారు.